Wednesday, 7 September 2011

ఐనవోలు మల్లన్న (మల్లికార్జునస్వామి) దేవస్థానం : ఐనవోలు(గ్రా.)వరదన్నపేట(మం.)వరంగల్(జిల్లా)


వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలోని ఐనవోలు గ్రామంలో ఈ దేవస్థానం ఉన్నది. స్వామివారి రూపం భీకరంగా పది అడుగుల ఎత్తుతో,విశాల నేత్రాలతో,కోరమీసాలతో  ఉంటుంది.చతుర్భుజాలు కలిగి నాలుగు చేతులలో ఖడ్గం,త్రిశూలం, ఢమరుకం,పానపాత్ర ఉంటాయి.ఇరువైపులా దేవేరులు 'గొల్ల కేతమ్మ,బలిజ మేడలమ్మ 'కొలువుదీరి ఉంటారు.కుడి పాదం క్రింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు 'మణి-మల్లాసురుల 'శిరస్సులుంటాయి.  ఈస్వామివారిని మల్లన్న,మల్లికార్జునస్వామి, ఖండేల్ రాయుడు అని పిలుస్తారు.మహారాష్ట్రలో ఈ మూర్తిని ఖండోబా,ఖండేరాయ,మల్`హర్ అని, కర్ణాటకలో మైలారలింగయ్య,మైలారదేవ అని వ్యవహరిస్తారు.మహారాష్ట్రలోని పూణే నగరానికి దగ్గరలోని "జెజూరి" గ్రామంలోని ఒక కొండపై ఈ ఖండోబా దేవాలయం ఉన్నది.ఇక్కడ జరిగే ఉత్సవాలన్నీ భాషా సంస్కృతులు వేరైనా మన పద్ధతినే పోలి ఉంటాయి. బహుశా మన ప్రాంతంలో జైన మత ప్రాబల్యం తగ్గిపోయి, వీరశైవ మతం,బసవ సాంప్రదాయం బాగా ప్రాచుర్యంలోనికి వచ్చిన దశలో ఈ ఆలయాలు నెలకొల్పబడి ఉంటాయి.ఎందుకంటే చాళుక్య రాజులలో చాలామంది జైనమతావలంబకులై ఉండగా తదనంతరం రాజ్యపాలన చేసిన కాకతీయులు శైవాన్ని,వీరశైవాన్ని బాగా ఆదరించారు.ఈ కాలంలోనే ఎన్నో జైన దేవాలయాల రూపురేఖలు మారిపోయాయని చరిత్రకారుల విశ్వాసం.

ఇక మన ఐనవోలు  ఆలయం విషయానికి వస్తే, ఇది' త్రిభువనమల్ల' బిరుదాంకితుడైన, చాళుక్య విక్రమాదిత్యుని మంత్రిగా ఉన్న' అయ్యన్నమంత్రి' చే నిర్మింపబడి 'అయ్యన్నప్రోలు ' గా పిలువబడి, ప్రస్తుతం ఐనవోలు గా రూపాంతరం చెందింది. ఇతని పాలనాకాలమ్ము క్రీ.శ.1077-1129.  ఈ ఆలయానికి తూర్పు మరియు దక్షిణ దిశలలో రెండు కీర్తితోరణాలను ' కాకతీయ రుద్రదేవుడు ' ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే ఇక్కడ నిర్మింపజేశాడు .అందుకు తార్కాణంగా  ఇదే శైలిలో నిర్మింపబడిన ' కాకతీయ కీర్తితోరణాలను'  ఈ నాటికీ మనం ఓరుగల్లు కోటకు నాలుగు దిక్కులా మనం చూడవచ్చును. అయితే ఓరుగల్లులోని కీర్తితోరణాల శిల్పనిర్మాణ శైలి, సౌందర్యం చాలా పరిణతి చెంది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతటి శిల్పసౌందర్యం  ఐనవోలు  తోరణాలలో మనకు కనిపించదు. అయితే, ఐనవోలు దేవాలయానికి  శిలాతోరణాలను నిర్మించడం వెనుక ఒక కథను ఉటంకిస్తారు. అయితే ఈ ఐనవోలు శిలాతోరణాలను నిర్మింపజేయడం వెనుక ఒక గాధను ఉటంకిస్తారు.అదేమంటే, కాకతీయ ప్రోలరాజు ఒకరోజున  వేయిస్థంభాల దేవాలయంలో, నిద్రలో ఉన్న తనకుమారుడు  రుద్రదేవుణ్ణి పుత్రవాత్సల్యంతో స్పృశించగా, మగతనిద్రలో ఉన్న రుద్రదేవుడు,తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చినారని భావించి,తన మొలలోఉన్న కైజారును తీసి రుద్రదేవుణ్ణి  పొడుస్తాడు.తండ్రి చావుకు కారకుడనైనానన్న పాపభీతితో ఐనవోలు ఆలయానికి శిలాతోరణాలను నిర్మింపజేశాడు .ఈ అంశం,1935వ సం.లో శ్రీ మారేమండ రామారావు గారి సంపాదకత్వంలో వెలువడిన 'కాకతీయ సంచిక 'లో పేర్కొనబడినది.

ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగం అర్థప్రాణవట్టంపై ఉన్నది. ఇది అరుణ వర్ణంలో ఉంటుంది. కుజ గ్రహానికి అధిష్టాన దైవతం. శివలింగంపై పార్థప్రహారం స్పష్టంగా కనిపిస్తుంది.

 స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి.ఇవి పాంచాహ్నిక దీక్షతో,అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం,నందివాహనం,పర్వతవాహనం,రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు.అయిదవరోజున ప్రాతః కాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో
వైభవంగా నిర్వహించి,శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు.ప్రతీ మాసశివరాత్రి రోజున మహన్యాసపూర్వకరుద్రాభిశేకం,శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి.

ప్రధానంగా మల్లన్న యాదవుల,కురుమల ఇష్టదైవం.ఇది ప్రముఖమైన జానపదుల జాతర.సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది,బుధవారాల్లో జరుగుతుంది.'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు.అనతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు,ఢమరుకాన్ని వాయిస్తూ,నేలపై రంగురంగుల ముగ్గులనువేసి,జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని  చేస్తారు.దీన్ని పట్నం వేయడం అంటారు.ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారికళ్యాణం. ప్రతీ మాస శివరాత్రిరోజున నజరుపట్నం,మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.            

     



          

No comments:

Post a Comment